శేషేంద్రజాలం గ్రంథ సమీక్ష శేషేంద్ర పుస్తకాలను సమీక్షించడమే దుస్సాహసం. ఆధునికతనూ, సంప్రదాయాన్ని మేళవించి కవితకు సరికొత్త రూపునిచ్చిన శేషేంద్రకు రసదృష్టి, శ్రామిక పక్షపాతం రెండుకళ్లు. చేతులెత్తి గ్రీష్మానికి / చెమట బొట్టు మొక్కింది / గగనానికి ఇంద్రధనుస్సు కలగాలని కోరింది - అనడంలోనే పై రెండు లక్షణాలు స్పష్టమవుతాయి. తన తొలిదశ కావ్యమైన 'ఋతుఘోష'లో విశ్వనాథాదులు అబ్బురపడేలా చెప్పిన రసవంతమైన పద్యాలు మరోమారు మనముందుకు వచ్చాయి. కదిలించే కవిత్వమే కాదు... అద్భుత కథలూ ఆయన కలం నుంచి జాలువారాయన్న విషయం 'విహ్వల' పుస్తకం చదివినవారికి తెలుస్తుంది. ఇందులోని 'మబ్బుల్లో దర్బారు' ఓ గొప్ప నాటిక. అధికార బలంతో భూమి అంతా నాదేనని విర్రవీగి మానవుడికి పంచభూతాలు బుద్ధిచెప్పడం దీని ఇతివృత్తం. నాటిక అద్యంతం సునిశిత హాస్య వ్యంగ్య ధోరణిలో సాగి శేషేంద్ర కలం బలాన్ని వెల్లడిస్తుంది. వివిధ కాలాల్లో శేషేంద్ర రాసిన సుప్రసిద్ధ కవితలు, పద్యాలు, ఖండికలు కూడా వీటిలో చోటు చేసుకున్నాయి. సాహిత్యాభిమానులను తప్పనిసరిగా అలరించే పుస్తకాలివి. ఆయన ప్రథమ వర్థంతి సందర్భంగా వీటిని ప్రచురించారు. - చంద్రప్రతాప్ ఈనాడు *** నూతన తీరాలు ఈ ఉషస్సు ఎన్ని తీరాలు ఎన్ని తుఫానులు ఎన్ని ఉదయాస్తమయాలు దాటి వచ్చిందో నలుదిక్కులా ముసిరి విసిరే ఈ నూతన వన పవనాలతో కలసి ఒక కొత్త గొంతెత్తి కేక వేస్తోంది అది ఒక కొత్తకల ఆది ఒక కొత్త ఆల; మనమీదికి దూకుతున్న అల.... ఈ ఉషస్సు కురిసే రక్తిమలో స్నానంచేసి మానవుడు శుచి ఐ ఆకాశాన్ని తన్నే సముద్రతరంగంలా మన తీరాలమీదకు విరుచుకుపడుతున్నాడు; మనుషుల్ని విభజించే ఇనప తెరల్ని త్రెంచి దళిత జీవుల మొరల్ని ఒరల్లో ఖడ్గాలుగా ధరిస్తున్నాడు! ఓహ్! మన మనోద్వార తోరణానికి మానవతా సూర్యుడు జ్వలత్ జ్వాలాగుచ్ఛమై వ్రేలాడుతున్నాడు. భాషలు ఆరవేసిన వలువల్లా ఎగిరిపోతున్నాయి దేశాల సరిహద్దులు ఈ ఝంఝామారుతాల ధాటికి గజగజ వణకిపోతున్నాయి. మానవత నగ్నంగా ఉద్విగ్నంగా నూతన వ్యక్తీకరణకోసం చూస్తోంది దిశాంచలాల్లోకి. - (శేషజ్యోత్స్న - 1973) *** మహా కవి శేషేంద్ర 94వ జయంతి సందర్భంగా కవి కుమారుడు సాత్యకి అందిస్తున్న అరుదైన కానుక *** Seshendra : Visionary Poet of the Millenium http:// seshendrasharma.weebly.com